బీఆర్ఎస్ సర్వేలో పాల్గొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
సర్వే పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న మంత్రి పొన్నం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొంతమంది సర్వేలో పాల్గొనకుండా తమ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇది రీసర్వే కాదని పొన్నం స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే బీఆర్ఎస్ అగ్రనేతలు సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు.బీజేపీ వ్యాపారస్తుల అనుకూల పార్టీ. కులగణన, బీసీ, ఎస్టీ వర్గీకరణ ఆ పార్టీకి ఇష్టం లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి. సర్వే పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సామాజిక మార్పు కలిగించే నిర్ణయం ఇది. రాజకీయ విమర్శల కోసమే బీజేపీ నేతలు బీసీలు, ముస్లింలపై విమర్శలు చేస్తున్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేద ముస్లింలు బీసీలోనే కొనసాగుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తాం. బలహీనవర్గాలపై చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో బిల్లును అడ్డుకోవద్దని మంత్రి పొన్నం అన్నారు.