19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు, ప్రభుత్వ వైఫల్యాలపైనే చర్చ
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించాలని మాజీ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ఇతర ముఖ్య నాయకులను సమావేశానికి ఆహ్వానించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించారు. బీఆర్ఎస్ ను స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, నిర్మాణం, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా చర్చిస్తారు. రాష్ట్ర ప్రజలు తమ హక్కులు సాధించుకునేలా చైతన్యం పరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.