కోడిపందేలతో నాకు సంబంధం లేదు
అది ఫాం హౌస్ కాదు.. మామిడి, కొబ్బరి తోట మాత్రమే : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్ మండంలం తొల్కట్లలోని తన భూమిలో నిర్వహించినట్టుగా చెప్తోన్న కోడిపందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల నోటీసులకు వివరణ ఇస్తానని.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 2018లో మొయినాబాద్ లో 10.01 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని, అప్పటి నుంచి ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలను తన మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డి చూస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, మామిడి తోట, కొబ్బరి తోటతో పాటు పని చేసేవారి కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. తన ప్రమేయం లేకుండానే తోటను తన మేనల్లుడు వర్రా రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారని.. ఆ విషయం కూడా కోడి పందేల విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత తాను ప్రశ్నిస్తే తన మేనల్లుడు చెప్పాడని వివరించారు. రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వెంకటపతి రాజుకు కౌలుకు ఇచ్చారని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నట్టుగా అక్కడ జరిగిన అసాంఘిక కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదన్నారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.