పరీక్ష ఎదుర్కోలేమనేవారు.. రాజీనామా చేసి వెళ్లండి.. - ఉపాధ్యాయులపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

పంచాయతీ, స్థానిక సంస్థల ద్వారా సుమారు 4 లక్షల మంది టీచర్లను నియమించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల ద్వారా ఎంపికయ్యే స్కూల్‌ టీచర్లతో సమాన హోదా కల్పించేందుకుగాను 2023లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

Advertisement
Update: 2024-06-29 02:01 GMT

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోధన సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారి అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి వారు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టం లేనివారు ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

బిహార్‌ స్థానిక సంస్థలు నియమించుకున్న ఉపాధ్యాయులు ఈ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలను చూడండి. ఉద్యోగం పొందిన ఓ పోస్టుగ్రాడ్యుయేట్‌కు కనీసం లీవ్‌ లెటర్‌ కూడా రాయడం రాని పరిస్థితి. మన దేశంలో విద్య స్థాయి ఇదేనా? వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు సవాలు చేస్తున్నారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. ఇటువంటి పరీక్షలను ఎదుర్కోలేమని చెప్పేవారు.. ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లండి‘ అని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల‌తో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు లేదా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివించే స్థోమత అందరికీ ఉండదని ధర్మాసనం అభిప్రాయపడింది.

బిహార్‌ పంచాయతీ, స్థానిక సంస్థల ద్వారా సుమారు 4 లక్షల మంది టీచర్లను నియమించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల ద్వారా ఎంపికయ్యే స్కూల్‌ టీచర్లతో సమాన హోదా కల్పించేందుకుగాను 2023లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్వహించే బోధన సామర్థ్య పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన పెట్టారు. ఇది తప్పనిసరి కాదని, పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ప్రభుత్వ ఉపాధ్యాయుల హోదా లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనిని అక్కడి హైకోర్టు కూడా సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ పలు కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

Tags:    
Advertisement

Similar News