కొత్త సీఈసీ నియామకంపై తొందరెందుకు?
నూతన సీఈసీ నియామకం రాజ్యాంగవిరుద్ధమని కేసీ వేణుగోపాల్ పోస్ట్
నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ నియామక ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. సీఈసీ జ్ఞానేశ్కుమార్ నియామక నిర్ణయం తొందరపడి చేశారు. సీఈసీ నియామకం ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రాతినిథ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ నియామకం చేపట్టింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలిగించడంపై బుధవారం (ఫిబ్రవరి19న) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఈ లోపే సీఈసీని కేంద్రం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్రం ప్రభుత్వ చర్యలో కనిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తున్నదో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్, ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలు బలపడుతాయని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో పేర్కొ న్నారు.