అమెరికా నుంచి 205 మంది భారతీయులు వెనక్కి
అమృత్సర్లో ల్యాండ్ అయిన ప్రత్యేక విమానం
అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న 205 మంది భారీతీయులను వెనక్కి పంపారు. టెక్సాస్ నుంచి సీ -17 సైనిక విమానంలో వారిని భారత్కు తరలించారు. ఆ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్ సర్లో ల్యాండ్ అయ్యింది. అమెరికా అధ్యక్షడిగా డొనాల్డ్ ట్రంప్ పాలన పగ్గాలు చేపట్టగానే ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపింది. ఈక్రమంలోనే 205 మంది భారతీయులను వెనక్కిపంపింది. అమెరికాలో 20, 407 మంది భారతీయులు అక్రమంగా నివాసముంటున్నారని గుర్తించారు. వారిలో 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్వో) కస్టడీలో ఉన్నారు. వారిని మినహా మిగిలిన 17,940 మందిని వెనక్కి పంపేందుకు అమెరికా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం 205 మంది స్వదేశానికి తిరిగి చేరుకోగా మిగిలిన వారిని తర్వలోనే వెనక్కి పంపేయనున్నారు. భారత్తో పాటు గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు వెనక్కి పంపేస్తుంది. వీసా గడువు ముగిసిన తర్వాత సరైన పత్రాలు లేకుండా ఇతర దేశాల్లో ఎవరైనా నివాసం ఉండటానికి తాము వ్యతిరేకమని భారత్ ఇదివరకే ప్రకటించింది. అలాంటి వారిని స్వదేశానికి తిరిగి తీసుకువస్తామని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది.