సత్యం సుందరం సినిమాపై నాగార్జున షాకింగ్ కామెంట్స్

సత్య సుందరం చిత్రం బాల్యంలో కలలు, జ్ఞాపకాలను గుర్తుచేసి, కార్తీ, అరవింద్ స్వామి నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

Advertisement
Update:2024-09-30 17:19 IST

సత్య సుందరం ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రం. ఈ మూవీలో హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబరు 28న విడుదలైన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్ తో ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాని వీక్షించిన కింగ్ నాగార్జున ‘ఎక్స్’లో తన స్పందన తెలియజేసి యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ఎన్నో బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసిందని నాగార్జున కొనియాడారు. ఈ సందర్భంగా నాగ్… "డియర్ కార్తీ.. నిన్న రాత్రి సత్య సుందరం మూవీ చూశాను!! నువ్వు, అరవింద్ చాలా బాగా మెప్పించారు. సినిమాలో నిన్ను (కార్తీ) చూసి నవ్వుతూనే ఉన్నాను. అదే చిరునవ్వుతో నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాను. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న మీ నటన ప్రేక్షకులు, విమర్శకులు అభినందనలు కురిపిస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది!! మూవీ యూనిట్‌కు మొత్తం నా అభినందనలు’’ అని రాసుకొచ్చారు.

ఈ సినిమాలో చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు.. ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఒక్క నాగార్జునే కాదు, ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇలాగే స్పందిస్తున్నారని చెప్పాలి. ’96’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్, ఆయన నుంచి వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందడం గమనార్హం. అలాగే, ఈ సినిమాలో కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ’96’కి సంగీతం అందించిన గోవింద్ వసంత్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకుంటున్నాయి.



Tags:    
Advertisement

Similar News