పులివెందులకు జగన్.. ఎందుకంటే..?

వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్న సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.

Advertisement
Update: 2024-08-31 02:18 GMT

వైసీపీ అధినేత జగన్, సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తున్నారు. నేటినుంచి మూడురోజులపాటు ఆయన పులివెందులలో పర్యటిస్తారు. స్థానిక నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పులివెందులకు వస్తున్నారనడంతో స్థానిక నేతలు ఆయన్ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈరోజు ఉదయం 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్‌కి చేరుకుంటారు జగన్, అక్కడే పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుస్తారు. అక్కడినుంచి పెండ్లిమర్రి మండలం మాచనూరుకి వెల్తారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన అక్కడే కొంత సమయం గడిపి తర్వాత గొందిపల్లి చేరుకుంటారు. కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. కొత్త దంపతులను జగన్ ఆశీర్వదిస్తారు. అక్కడినుంచి ఆయన పులివెందులకు చేరుకుంటారు.

ఈరోజు పర్యటన ముగిసిన తర్వాత పులివెందులలో విశ్రాంతి తీసుకుని రేపటినుంచి స్థానిక నాయకులకు జగన్ అందుబాటులో ఉంటారు. ఆదివారం, సోమవారం ఆయన పులివెందులలోనే ఉంటారు. వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్న సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ, మరో ఇద్దరు ఎంపీలు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు, మరికొందరు అదే దారిలో ఉన్నారనే వార్తలు వినపడుతున్నాయి. జంప్ జిలానీల వల్ల పార్టీకి నష్టమేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నా, నేరుగా జగన్ మాత్రం ఫిరాయింపులపై స్పందించకపోవడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News