ప్రజాపాలనలో మీడియా స్వేచ్ఛ లేకుండాపోయింది
సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి, యువ జర్నలిస్టు తన్వీ యాదవ్ను అరెస్టులను ఖండించిన కేటీఆర్;
సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉదయం 5 గంటలకు ఇంటిపై దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని విమర్శించారు. రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వీ యాదవ్ను అరెస్టు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు.ఒక రైతు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్టులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.