Telugu Global
Telangana

ప్రేమ పెళ్లిని కాదన్నారని అత్తమామల్ని చంపేశాడు

జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హన్మ‌కొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

ప్రేమ పెళ్లిని కాదన్నారని అత్తమామల్ని చంపేశాడు
X

ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తమ పెళ్లిని యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడాన్ని సహించలేకపోయాడు. ఉన్మాదిలా మారి వారి ప్రాణాలే తీశాడు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పదహారు చింతల తండాలో నివాసముంటున్న బానోతు శ్రీనివాస్‌ (45), బానోతు సుగుణ (40) దంపతుల కుమార్తె దీపిక. గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణ‌యించారు. పెద్దలు అంగీకరించకపోవడంతో గత నవంబర్‌లో వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హన్మ‌కొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

ఇటీవల దీపిక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో బన్నీ ఉన్మాదిగా మారాడు. గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో వారి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్, సుగుణ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వాస్ప‌త్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. ఈ ఘటనలో దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌ కూడా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం హన్మ‌కొండలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, నెక్కొండ సీఐ చంద్రమోహన్‌ పర్యవేక్షణలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

First Published:  11 July 2024 6:51 AM GMT
Next Story