Telugu Global
Telangana

మంత్రి గన్‌మెన్ వేధింపులతో.. కిరాణా షాపు యజమాని ఆత్మహత్య?

హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని రాష్ట్ర మంత్రి మంత్రి గన్‌మెన్ వేధింపులతో కిరాణా షాపు యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు

మంత్రి గన్‌మెన్  వేధింపులతో.. కిరాణా షాపు యజమాని ఆత్మహత్య?
X

అప్పు తీసుకున్న వ్యక్తికి మధ్యవర్తిగా ఉన్న కిరాణా షాపు యజమానిని మంత్రి గన్‌మెన్ వేధింపులకు గురి చేయడంతో దీనిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్ నగర్‌లో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్ నగర్ చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఫైనాన్షియర్ గా ఉన్న రమేశ్ ఐదేళ్ల క్రితం ఇదే కాలనీకి చెందిన విష్ణుకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. కిరాణం షాపు నడుపుకుంటున్న ఇతడికి రాంబాబు మధ్యవర్తిగా (జమానాత్) ఉన్నాడు. అప్పు తీసుకున్న విష్ణు అడ్రస్ లేక పోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ అసహనానికి గురయ్యాడు. దీంతో తన బంధువు సుబేదారి పోలీసు స్టేషన్లో ఇంటర్సెప్టర్ వాహన డ్రైవర్ గా విధులు నిర్వ ర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ తో కలిసి రాంబాబును వేధింపులకు గురిచేశారు. కొంత డబ్బు ఇచ్చాక కూడా ఉపేందర్ అతడిని బెదిరింపులకు గురిచేశాడు. 'నేను మంత్రి వద్ద డ్యూటీ చేస్నున్న.. మొత్తం డబ్బులు ఇవ్వాలి.. లేకుంటే కేసు పెట్టి తొక్కిస్తా.." అని ఫోన్లో బెదిరించడంతో మనస్తాపానికి గురైన రాంబాబు ఈ నెల 17న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధు వులు న్యాయం చేయాలని కోరుతూ రాంబాబు మృతదేహాన్ని హనుమకొండలోని మంత్రి ఇంటిముందు కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనతో సంబంధం లేదని పోలీసులు తెలపడంతో రాంనగర్’లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ ఇంటి ముందు ధర్నా చేశారు. రాంబాబు ఆత్మహత్యకు కార ణమైన రమేశ్, ఉపేందర్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా సమయంలో రమేశ్ ఇంటికి తాళంవేసి కుటుంబంతో పరార్ అయ్యాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారా యణరెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

First Published:  21 Oct 2024 3:38 PM GMT
Next Story