మూసీ రివర్ బెడ్ లోని 163 ఇండ్లను ఖాళీ చేయించాం
మరో 700 ఇండ్లు ఖాళీ చేయించాల్సి ఉంది.. హైదరాబాద్ ఆర్డీవో మహిపాల్

మూసీ రివర్ బెడ్ లో ఉన్న 163 ఇండ్లను ఖాళీ చేయించామని హైదరాబాద్ ఆర్డీవో మహిపాల్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన మరో 700 ఇండ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. మరో పది రోజుల్లోగా మూసీ రివర్ బెడ్ లో ఉన్న అన్ని ఇండ్లను ఖాళీ చేయిస్తామని తెలిపారు. జియాగూడలో 15, పిల్లిగుడిసెలు ప్రాంతంలోని 136, ప్రతాపసింగారంలో 16, నార్సింగిలో 7 కుటుంబాలకు పునరావాసం కలిపించామని వివరించారు. సెప్టెంబర్ 26న రివర్ బెడ్ లోని ఇండ్లను మార్కింగ్ చేయడంతో పాటు వాటిలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఖాళీ చేయించిన ఇండ్లను కూల్చివేయడం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఖాళీ చేయించిన ఇండ్లు అలాగే ఉంటే వాటిలో ఇతరులు వచ్చి ఉండే అవకాశం ఉందని, అందుకే కూల్చేయాలని నిర్ణయించామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 23 కుటుంబాలు, మేడ్చల్ జిల్లాలో 33 కుటుంబాలను మూసీ రివర్ బెడ్ నుంచి తరలించామన్నారు. చాదర్ ఘాట్ డివిజన్ లోని మూసానగర్ , రసూల్ పురాలో ఖాళీ చేసిన ఇండ్ల కూల్చివేతలు మంగళవారం ప్రారంభించారు. మూసీ రివర్ బెడ్ నుంచి ఖాళీ చేయించిన కుటుంబాలకు పిల్లిగుడిసెలు ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించామన్నారు.