Telugu Global
Telangana

2,898 నామినేషన్లకు ఓకే.. విత్‌డ్రాకు ఇవాళే ఆఖరు..!

సీఎం కేసీఆర్‌, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్న కామారెడ్డిలో 64 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఆరుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

2,898 నామినేషన్లకు ఓకే.. విత్‌డ్రాకు ఇవాళే ఆఖరు..!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కీలకఘట్టానికి చేరుకున్నాయి. పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే మిగిలుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవాల్టితో ముగియనుంది. దీంతో బరిలో ఎంతమంది ఉంటారనేదానిపై క్లారిటీ రానుంది. పరిశీలన తర్వాత 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఆమోదం పొందాయి. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు.

అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో 38 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా.. నిజామాబాద్ రూరల్, సంగారెడ్డి, మెదక్‌, జడ్చర్ల, కొడంగల్‌, డోర్నకల్, వైరా నియోజకవర్గాల్లో ఒక్కొ నామినేషన్ తిరస్కరించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 127 మంది నామినేషన్లు వేయగా.. పరిశీలనలో 13 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 114 మంది అభ్యర్థులు మిగిలారు. రాష్ట్రంలో అత్యధిక మంది పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే.

ఇక సీఎం కేసీఆర్‌, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్న కామారెడ్డిలో 64 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఆరుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో పోటీలో 58 మంది మిగిలారు. రేవంత్‌ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కొడంగల్‌లో 15 మంది బరిలో ఉన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్‌లో 67 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక నారాయణపేట నియోజకవర్గంలో అతి తక్కువగా ఏడుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు.

First Published:  15 Nov 2023 2:27 AM GMT
Next Story