Telugu Global
Telangana

ఎక్కువ సభ్యత్వాలు చేయించిన వారికే పదవులు

లోక్‌సభ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదన్న కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఎక్కువ సభ్యత్వాలు చేయించిన వారికే పదవులు
X

పదిహేను రోజుల్లో నిర్దేశించుకున్న సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దేశవ్యాప్తంగా తిరుగుతున్న ఆయన ఇవాళ పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారుల సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు.

బీజేపీ తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నదని.. లక్ష్యానికి మించి చేయాలని నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 77 లక్షల ఓట్లు, ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదన్నారు. అన్నివర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సి అంశాలపై నడ్డా ఈ సందర్భంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

First Published:  28 Sept 2024 2:08 PM GMT
Next Story