Telugu Global
Telangana

ముగిసిన భేటీ.. చర్చల సారాంశం ఏంటి..?

ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాళోజీ రచించిన నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబుకి రేవంత్ రెడ్డి బహూకరించారు.

ముగిసిన భేటీ.. చర్చల సారాంశం ఏంటి..?
X

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. ఇప్పటికిప్పుడు ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు కానీ, ఆ దిశగా ముందడుగు పడినట్టు చెబుతున్నారు. దాదాపు 2 గంటలసేపు జరిగిన ఈ సమావేశంలో 10 కీలక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, ఇరు రాష్ట్రాల అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. కాలయాపన లేకుండా నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలుస్తోంది.


ఆ 10 అంశాలు ఏంటంటే..?

రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, వాటి పంపకాలు

విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు

ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లోని అంశాలు

విలీన మండలాలనుంచి ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వడం

ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం చెల్లించుకోవాల్సిన పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు

విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన 15 ప్రాజెక్టులకు సంబంధించి అప్పుల పంపకాలు

ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు

ఏపీకి హైదరాబాద్ లో 3 భవనాల కేటాయింపు

లేబర్‌ సెస్‌ పంపకాలు

ఉద్యోగుల విభజన అంశాలు

ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనగానే రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హడావిడి మొదలైంది. వైరి వర్గాల విమర్శలు ఎలా ఉన్నా.. ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాళోజీ రచించిన నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబుకి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, అధికారులు.. ఏపీ నుంచి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, అధికారులు కూడా పాల్గొన్నారు.

First Published:  6 July 2024 4:00 PM GMT
Next Story