Telugu Global
Telangana

మాపై అంత చిన్నచూపెందుకు..?

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ టీమ్ బిజీబిజీగా ఉంది. జల్‌ శక్తి మంత్రితో జరిగిన భేటీలో మూసీ ప్రక్షాళనకు నిధులు కావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

మాపై అంత చిన్నచూపెందుకు..?
X

2019లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప్రారంభ‌మైనా ఆ ప‌థ‌కం కింద ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ‌కు నిధులు ఇవ్వలేద‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ‌లో ఇంకా 7.85 ల‌క్షల ఇళ్లకు మంచినీటి కుళాయి క‌నెక్షన్ లేద‌నే విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. కుళాయి కనెక్షన్ లేని 7.85 ల‌క్షల‌ ఇళ్లతో పాటు కొత్తగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు కూడా మంచినీటి కనెక్షన్లు ఇచ్చేందుకు నిధులు కేటాయించాలన్నారు. మొత్తం రూ.16,100 కోట్ల నిధులు తెలంగాణకు కేటాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ టీమ్ బిజీబిజీగా ఉంది. జల్‌ శక్తి మంత్రితో జరిగిన భేటీలో మూసీ ప్రక్షాళనకు నిధులు కావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళణకు రూ.4వేల కోట్లు, గోదావరి జలాలతో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలను నింపే పనులకోసం రూ.6వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కూడా నేతలు కలిశారు. తెలంగాణలో ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేసే పథకంలో వినియోగ‌దారుల‌కు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కుచెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని కోరాను.


పొలిటికల్ భేటీ..

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలవడంతోపాటు పార్టీ పెద్దల్ని కూడా సీఎం, డిప్యూటీ సీఎం కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై వారితో చర్చించారు.



First Published:  22 July 2024 4:03 PM GMT
Next Story