Telugu Global
Telangana

ఇది ప్రజా పాలన కాదు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలనం

మక్తల్‌ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మెసేజ్‌ను షేర్ చేశారు శ్రీహరి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో రెడ్డిలే ఉన్నారని, అధికారులు సైతం రెడ్డిలే ఉన్నారనేది ఆయన సందేశం.

ఇది ప్రజా పాలన కాదు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలనం
X

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు, మంత్రి పదవులు, కార్పొరేషన్‌ ఛైర్మన్ల భర్తీ విషయంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ వాట్సాప్‌లో షేర్‌ చేసిన ఓ సందేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సీఎం రేవంత్ సొంత జిల్లాకు చెందిన శ్రీహరి ముదిరాజ్‌ బీసీ కోటాలో తెలంగాణ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ రేవంత్ రెడ్డి సైతం ఆయనకు హామీ ఇచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జన జాతర సభలో ప్రకటించారు. దీంతో శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇటీవల జ‌రుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పేరును పక్కకు తప్పించినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మక్తల్‌ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మెసేజ్‌ను షేర్ చేశారు శ్రీహరి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో రెడ్డిలే ఉన్నారని, అధికారులు సైతం రెడ్డిలే ఉన్నారనేది ఆయన సందేశం. అందుకు సంబంధించిన అధికారులు, నేతల జాబితాను కూడా ఆయన షేర్ చేశారు. ఇది ప్రజా పాలనా, రెడ్డి పాలనా అంటూ ప్రశ్నించారు శ్రీహరి. ఎవని పాలయిందిరో తెలంగాణ అంటూ ఆ మెసేజ్ ఎండ్ అయింది. ఈ మెసేజ్‌ కాస్త వైరల్‌గా మారింది. తర్వాత వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆ మెసేజ్‌ను తొలగించారు వాకిటి శ్రీహరి.

First Published:  8 July 2024 6:20 AM GMT
Next Story