Telugu Global
Telangana

రేవంత్‌.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీకి రా

ముఖ్యమంత్రికి ఈటల రాజేందర్‌ సవాల్‌

రేవంత్‌.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీకి రా
X

సీఎం రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ నది పరిసరాల్లో కూలగొట్టబోయే ఇండ్ల దగ్గరికి పోదాం రా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. తనపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఈటల తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి డేట్‌ నిర్ణయించాలని.. చైతన్యపురిలాంటి కాలనీకి పొదామా చెప్పాలన్నారు. అక్కడ ఎవరైనా కూల్చివేతలపై శభాష్‌ రేవంత్‌ రెడ్డి అని మెచ్చుకుంటే తాను బహిరంగ క్షమాపణ చెప్తానన్నారు. ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తాను పాఠశాల విద్య నుంచి హైదరాబాద్‌ లోనే చదువుకున్నానని, ఇక్కడే వ్యాపారాలు చేశానని.. తనను పట్టుకొని బతకడానికి వచ్చానని రేవంత్‌ అనడంపై మండిపడ్డారు. కొంచెం చదువుకుని ఉంటే సంస్కారం వచ్చేదని, ఎవరైనా చెప్పేది విన్నా బాగుండేదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. రేవంత్‌ కు దమ్ముంటే తన సవాల్‌ పై స్పందించాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు ఈటల రాజేందర్‌ ను ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెత్తిమీద జుట్టులేనోళ్లు కూడా మాట్లాడుతున్నారని, ఆయన పార్టీ మారినా పాత వాసనలు పోలేదన్నారు. మూసీ బాధితుల లెక్కనే ఆయన కూడా వలస వచ్చాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.40 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుందని, ఆయన సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కట్టుకున్నప్పుడు ఈటల రాజేందర్‌, బీజేపీ ఎంపీలు మూసీ రివర్‌ ఫ్రంట్‌ కు, హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు తెస్తే ఏందని ప్రశ్నించారు. మోదీకి ఈటల ఊడిగం చేస్తున్నాడని ఆరోపించారు. పదేండ్లు ఆయన మంత్రిగా ఉండి ఏం వెలుగబెట్టిండో తెలంగాణ సమజం గమనిస్తలేదా అన్నారు.

First Published:  3 Oct 2024 11:26 AM GMT
Next Story