రూ.30 వేల కోట్ల విలువైన భూముల అమ్మకానికి రేవంత్ సర్కారు పన్నాగం
నాడు సుద్దులు చెప్పి.. ఇప్పుడు టెండర్లు పిలిచారు.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలిలో అత్యంత విలువైన భూముల అమ్మకానికి టీజీఐఐసీ టెండర్ నోటీస్ జారీ చేసిందని పేర్కొన్నారు. ''ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు.. భూముల వేలం పై మారిన ముఖ్యమంత్రి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి.. తెలంగాణ జాతి సంపద.. ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుంది.. అని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు.. తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిండు.. ఇపుడు వేల కోట్ల విలువైన భూములను అర్రాస్ వేసేందుకు తెరలేపిండు.. ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు.. పవిత్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను నీటి మూటలు చేస్తూ నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిస్సిగ్గుగా భూములను అడ్డికి పావుశేరుకు అమ్ముతుండటం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నది..'' అని మండిపడ్డారు.
కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో గల 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల చొప్పున రూ.10వేల కోట్లు ఇప్పటికే సమీకరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే భూమిని వేలం వేసి దాదాపు రూ.30వేల కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ''ఒకవైపు బ్యాంకులో తనఖా పెట్టడం, మరోవైపు తనఖా పెట్టిన అవే భూములను వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనం.. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధిని ఆధారాలతో సహా బయటపెట్టాను. జూన్ 26, 2024 నాడు విడుదల చేసిన జీవో ఎంఎస్ 54తో ఎకరానికి 75 కోట్ల చొప్పున మొత్తం 30వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని నేను అసెంబ్లీలో నిలదీస్తే.. అలాంటిదేమి లేదని, టీజీఐఐసీకి చేస్తున్న బూ బదలాయింపు మాత్రమేనని బుకాయించారు. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి, సభను, సభ్యులను తప్పుదోవ పట్టించారు. అసెంబ్లీ అయ్యిందో, లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి రూ. 10వేల కోట్ల రుణం తెచ్చుకున్నరు. మళ్లీ అసెంబ్లీ మొదలయ్యే లోపే ఇప్పుడు అదే భూమిని అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నరు. అధికారంలోకి రాగానే దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా దివాలా అని దిగజారుడు రాజకీయాలు చేశారు.. బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని, ప్రతిష్టను బజారు కీడ్చారు.. మూసీ సుందరీకరణ, హైడ్రా అంటూ లేనిపోని భయాందోళనలు సృష్టించి హైదరాబాద్ బ్రాండ్ ను దెబ్బతీశారు.. మొత్తంగా బీఆర్ఎస్ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణను మీ 14నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారు. తలాతోకలేని విధానాలు, నిర్ణయాల వల్ల రాష్ట్ర రాబడి తగ్గడం వల్ల చివరకు ప్రభుత్వ భూములను అమ్ముకొని ఆదాయం సమకూర్చుకునే స్థాయికి దిగజారారు..'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కారు భూములను అమ్ముకోవడానికి ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గత పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకోకతప్పడం లేదన్నారు. ఒకవైపు తెలంగాణ దివాలా తీసిందంటూనే, మరోవైపు ప్రభుత్వం రూపొందించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ (ఆర్ ఎఫ్ పీ)లో ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్దిలో తెలంగాణ రోల్ మోడల్ అని, ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే తలమానికం అని పేర్కొన్నారని వివరించారు. 2011-12 లో 3.6లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ, 2020-21 నాటికి 11.5 కోట్లకు చేరిందని, దేశంలోనే అత్యధిక ఎకనమిక్ గ్రోత్ నమోదు చేసిందని వివరించారని గుర్తు చేశారు. భూములు అమ్ముకోవడానికి డాక్యుమెంట్ల రూపంలో చెబుతున్న తెలంగాణ అభివృద్ధి గణాంకాలను, బహిరంగంగా ఎందుకు ఒప్పుకోవడం లేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ''కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసి దాచినా దాగదు.. అసత్యాలు ప్రచారం చేయడం, బుకాయించడం వంటివి ఇకనైనా మానుకోవాలి.. భూములు అమ్మబోమని ప్రజలను, అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించినందుకు యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలి.. ప్రభుత్వ భూములు అమ్మితే స్మశానానికి కూడా జాగ ఉండదన్న రేవంత్ రెడ్డి.. ఇప్పడు స్మశానాలకు భూములు ఎక్కడ పుట్టిస్తారో సమాధానం చెప్పాలి..'' అని డిమాండ్ చేశారు.