Telugu Global
Telangana

మహిళలకు ఇచ్చిన హామీలు..మార్చి 8 డెడ్‌లైన్‌ : ఎమ్మెల్సీ కవిత

మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు

మహిళలకు ఇచ్చిన హామీలు..మార్చి 8 డెడ్‌లైన్‌ :  ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు ఉత్తవేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వన్నికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10వేల పోస్టుల కార్డులు సేకరించారు. అనంతరం, పోస్టు కార్డులను సీఎం రేవంత్‌కు పంపించారు. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామన్నారు.

లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని చెప్పారు. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని విమర్శించారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు.సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తుచేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలడి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తాము కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం ప్రకటనకు, ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదని విమర్శించారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్పా పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశంలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడితే ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. మార్చి 8న ఈ పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని విమర్శించారు. నేరాల శాతం 20 శాతం పెరిగాయని డీజీపీ వెల్లడించారు. ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలన్నారు. కేసీఆర్ కిట్ పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ మానవత్వాన్ని మంటకలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  3 March 2025 1:24 PM IST
Next Story