Telugu Global
Telangana

42 లక్షల మంది రైతుల్లో 22 లక్షల మందికి రుణమాఫీ చేశాం

రుణమాఫీ వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల

42 లక్షల మంది రైతుల్లో 22 లక్షల మందికి రుణమాఫీ చేశాం
X

రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షల మంది అని.. వారిలో 22 లక్షల మంది రుణాలు మాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు చెప్తోన్న బీజేపీ నాయకులు రైతులను గందరగోళ పరిచి పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు. అందుకే రుణమాఫీ లెక్కలను మరోసారి చెప్తున్నానని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షల మంది అని.. వారిలో తెలంగాణలో భూములు ఉండి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అని తెలిపారు. 2018లో రుణమాఫీ చేసినప్పుడు 40 లక్షల మందిని పరిగణలోకి తీసుకున్నా వారిలో సగం మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు. తమ ప్రభుత్వం 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసిందని, వారిలో రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారి కుటుంబాలను నిర్దారణ చేసుకొని 22,37,848 మందికి రూ.17,933.19 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. మిగతా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని.. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ రుణమాఫీ చేస్తామన్నారు.

First Published:  3 Oct 2024 1:02 PM GMT
Next Story