Telugu Global
Telangana

పోరాటం కొనసాగుతుంది.. హైదరాబాద్ కు కవిత

ఢిల్లీలో కవిత బయలుదేరినప్పటినుంచి ఆమె ప్రయాణంపై సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

పోరాటం కొనసాగుతుంది.. హైదరాబాద్ కు కవిత
X

నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నా పోరాటం కొనసాగుతుంది అంటూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తన భర్త, సోదరుడు సహా ఇతర బీఆర్ఎస్ నేతలు వెంటరాగా ఢిల్లీ నుంచి విమానంలో కవిత హైదరాబాద్ బయలుదేరారు. మీడియాతో మాట్లాడిన ఆమె న్యాయ పోరాటం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తమకు మద్దతుగా నిలిచిన మీడియాకి, పార్టీ నాయకులకు ఆమె మరోసారి ధన్యవాదాలు తెలిపారు.


ఢిల్లీలో కవిత బయలుదేరినప్పటినుంచి ఆమె ప్రయాణంపై సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ సహా ఇతర నేతలు వెంటరాగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పటినుంచి కవిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్లైట్ లో వీడియోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా కూడా కవిత ధైర్యంగా ఉన్నారు. బరువు తగ్గి నీరసంగా కనపడుతున్నా కూడా ఆమె మాటల్లో ఎక్కడా బెరుకు లేదు.


ఇటు హైదరాబాద్ లో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాయి. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా ఆమె కదలి రాబోతున్నారు. కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా నిన్నటినుంచే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చాలా చోట్ల కవిత అభిమానులు, బీఆర్ఎస్ నేతలు స్వీట్లు పంచిపెట్టారు. ఈరోజు కూడా ఆ సంబరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరోసారి కవిత మీడియాతో మాట్లాడే అవకాశముంది.

First Published:  28 Aug 2024 10:47 AM GMT
Next Story