Telugu Global
Telangana

నేను మీ ఇటలీ రాణిని కాదు -కవిత

రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని, పేపర్ టైగర్ అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. "తెలంగాణ రండి, దోశల బండి దగ్గర ప్రచారం చేయండి, దోశలు తినండి.. కానీ తెలంగాణ అమరవీరుల తల్లులను కూడా కలవండి" అని రాహుల్ గాంధీకి సూచించారు.

నేను మీ ఇటలీ రాణిని కాదు -కవిత
X

బతుకమ్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ కవిత. వాస్తవానికి ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఎంపీ అర్వింద్ మాట్లాడారేమో అనుకున్నానని.. కానీ జీవన్ రెడ్డి అని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. అంత సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఆయన గెలిచేది లేదన్నారు. ఓటమి ఖాయమని తెలిసి, రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడేందుకు ఇంత దిగజారి మాట్లాడాలా అన్నారు కవిత.


తనను ఎలిజిబెత్ రాణి అంటూ పిలవడంపై కూడా గాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు కవిత. తానేమీ వారి ఇటలీ రాణిని కాదని, ఇటలీ రాణిలాగా వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకోలేదన్నారు. దిగజారిపోయి, వయసుని మరచిపోయి, హోదాని మరచిపోయి జీవన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కాస్త సోయి తెచ్చుకుని మాట్లాడాలని హితవు పలికారు కవిత.

బబ్బర్ షేర్ కాదు.. పేపర్ టైగర్

రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని, పేపర్ టైగర్ అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎవరో రాసిచ్చింది చదువుతుంటారని చెప్పారు. "తెలంగాణ రండి, దోశల బండి దగ్గర ప్రచారం చేయండి, దోశలు తినండి.. కానీ తెలంగాణ అమరవీరుల తల్లులను కూడా కలవండి" అని రాహుల్ గాంధీకి సూచించారు కవిత. అప్పుడే తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమవీరుల కష్టాల గురించి తెలుస్తుందని చెప్పారు. మంథని వెళ్లిన రాహుల్ గాంధీ.. పీవీ నరసింహారావు గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు కవిత. రాహుల్ యాత్రలో దళిత నాయకులకు మాట్లాడే అవకాశమివ్వలేదని, కేవలం దొరలైన శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. అలాంటి రాహుల్.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు కవిత.


First Published:  21 Oct 2023 10:48 AM GMT
Next Story