Telugu Global
Telangana

మూసీమే లూఠో, ఢిల్లీమే బాంటో

40 వేల కుటుంబాలను రోడ్ల మీద పారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు అని కేటీఆర్‌ విమర్శ

మూసీమే లూఠో, ఢిల్లీమే బాంటో
X

మూసీమే లూఠో, ఢిల్లీమే బాంటో అనేది కాంగ్రెస్‌ నినాదమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో (లక్షా యాభై వేల కోట్లు) మూసీ ప్రక్షాళన చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారు. మీ ఇళ్ల వద్దకు బుల్డోజర్‌ వస్తే కంచె అడ్డుపెట్టాలన్నారు.

అంబేర్‌పేట్‌ నియోజకవర్గం గోల్నాక డివిజన్‌ తులసి రామ్‌, న్యూ అంబేద్కర్‌ నగర్‌లో మూసీ పరీవాహ ప్రాంత వాసులను కేటీఆర్‌ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. మూసీ అభివృద్ధి పథకంతో నష్టపోతున్న బాధితులతో మాట్లాడారు. వారు తాము ఇక్కడి నుంచి కదిలేదని, ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్‌ రూమ్‌లు మాకు అవసరం లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. తమకు అండగా నిలువాలని వారంతా కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారు. ఎప్పుడు ఇళ్లు కూల్చుతారో అని ప్రజలు ఆవేదనలో ఉన్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన వారిని సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పారు. ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇండ్లు కూలగొట్టమని అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశావు. ఇండ్లు కూలగొడతానిన చెప్పలేదని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఇక్కడ దశాబ్దాలుగా ఉంటున్న మల్లయ్య ఇల్లు కూలగొట్టి అక్కడ మాల్‌ కడితే ఏం వస్తుంది మీకు రేవంత్‌ అని నిలదీశారు. ఇక్కడ ఉంటున్న పేద ఇండ్లు వంద గజాల్లో నే ఉండొచ్చు. కానీ వారి ఇండ్లను కూలగొట్టి పెద్ద పెద్ద మాల్స్‌, హోటల్స్‌ కడుతాను. పార్కులు చేస్తానని అంటున్నరేవంత్‌ ఇదంతా ఎవరి చేస్తానంటున్నారు. ఇక్కడ బొందల గడ్డ చేసి దానిపై ఏదో కడుతానంటే ఎవరి కోసమని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు? గరీబోళ్లను, పెద్ద మనుషులను చూసుకుంటానని చెప్పారు. ఇళ్లులు కడుతా, కరెంటు బిల్లులు కడుతానన్నారు. మీరు కట్టే అక్కరలేదు. సోనియా గాంధీ కడుతారు, ఫ్రీ గ్యాస్‌ ఇస్తా, ఫ్రీ బస్సు పెడుతానని సీఎం ఇన్ని కథలు చెప్పాడు. ఇండ్లు కడుతానని చెప్పిండా? కూడగొడుతానంటే ఓట్లు పడుతుండెనా? అని ప్రశ్నించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే వెంకటేశ్‌ మీకోసం నిలబడినాడు. కానీ మీరు గెలిపించిన ఎంపీ కిషన్‌రెడ్డి ఎక్కడికి పోయాడు? ఎందుకు మాట్లాడుతలేడు? గరీబుగాళ్లను లేపేయమని కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఏమైనా బదులుకున్నరా ఏంది? అని నిలదీశారు. అందుకే మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో ఆలోచించాలన్నారు. ఎవరి నియ్యతి ఏందో తెలుసుకోవాలని కోరారు. దేవుని పేరుతో ఓట్లు వేయించుకోవడం కాదు, పేద ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్లతో నిలబడేవాడు నాయకుడు అన్నారు. అంబర్‌పేట సుమారు 1500-1600 కుటుంబాలను రేవంత్‌ రెడ్డి రోడ్డు మీద వేస్తా అంటున్నాడు. అయితే బైటికి చెప్పే లెక్కలు వేరే లోపలి లెక్కలు వేరే ఉన్నాయన్నారు. ప్రభుత్వం చెబుతున్నది దాదాపు 18 వేల మంది పోతారని చెబుతున్నది. కానీ లోపలి లెక్కలు వేరుగా ఉన్నాయని సుమారు 40 వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర మందిని రోడ్ల మీద పారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు అన్నారు. ఈ కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ స్పందించారు. మా ఇళ్లు కూల్చడానికి మీరు ఎవరు? ఇళ్లు కూల్చి ఇక్కడ పార్కులు కడుతారా? అని ప్రశ్నించారు.

శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లోని ఇళ్ల కూల్చివేతలు

మరోవైపు మలక్‌పేట పరిధిలోని శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. గల్లీలు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నిర్వాసితులను డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు.

నిర్వాసితుల నిరసన

అయితే శంకర్‌నగర్‌లో నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యను తప్పపట్టారు. రెండు మూడు రోజులు ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి రెండు గంటలకు నిద్రపోకుండా చూశామన్నారు. ఒక్కో కుటుంబంలో ఏడెనిమిది మంది వరకు ఉంటారని ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. హుటాహుటిన మార్కింగ్‌ చేసి కూల్చివేయాల్సి అవసరం ఏమొన్నిందని బాధితులు నిలదీశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు వెళ్లిన నిర్వాసితులు నిరాశకు గురవుతున్నారు.

First Published:  1 Oct 2024 6:33 AM GMT
Next Story