Telugu Global
Telangana

తెలంగాణ భవన్ లో రాఖీ సంబరాలు.. కేటీఆర్ భావోద్వేగ ట్వీట్

బీఆర్ఎస్ కి చెందిన మహిళా నేతలు, బ్రహ్మ కుమారీలు.. తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ కు రాఖీలు కట్టారు.

KTR
X

తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మహిళా నేతలు రాఖీలు కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్మి తదితరులు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్‌కు రాఖీ కట్టి హారతి ఇచ్చారు. వారందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


ప్రతి ఏడాది తన సోదరి కవితతో రాఖీ కట్టించుకోవడం కేటీఆర్ కి అలవాటు. కానీ ఈసారి కవిత జైలులో ఉండటంతో ఆ అవకాశం లేకుండా పోయింది. సోదరిని గుర్తు చేసుకుంటూ కేటీఆర్ భావోద్వేగ ట్వీట్ వేశారు. ‘ఈ రోజు నువ్వు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నీ కష్టనష్టాల్లో ఎప్పుడూ నేను నీకు తోడు ఉంటాను.’ అని పోస్ట్‌ చేశారు. గతంలో కవితతో రాఖీ కట్టించుకున్న ఫొటోను, ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్తున్నప్పటి ఫొటోని కూడా తన ట్వీట్ కి జత చేశారు కేటీఆర్.


అటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. మహిళల శ్రేయస్సు, భద్రత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



First Published:  19 Aug 2024 9:25 AM GMT
Next Story