Telugu Global
Telangana

చారణా కోడికి బారణా మసాలా...!

ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఇప్పుడు ఫండ్స్ డైవర్షన్ తో కాలం గడుపుతోందన్నారు కేటీఆర్.

చారణా కోడికి బారణా మసాలా...!
X

తెలంగాణలో రైతు రుణమాఫీ తీరు చూస్తే.. చారణా కోడికి బారణా మసాలా అనే సామెత తెలంగాణ ప్రజలకు గుర్తొస్తుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఊరించి ఊరించి ఏడునెలలు ఏమార్చి చేసిన రుణమాఫీతో రైతులు కంటతడి పెడుతున్నారని మండిపడ్డారాయన. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని చెప్పారు. అన్నివిధాలా అర్హత ఉన్నా కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవాళ్లు ఎవరూ లేరన్నారు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేవాళ్లు కూడా కరువయ్యారని ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ట్వీట్ వేశారు కేటీఆర్.


రుణమాఫీ జరగక అర్హులైన లబ్దిదారులు ఆందోళనలో ఉంటే కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. 40 లక్షలమందిలో మెజార్టీ రైతులకు నిరాశ మిగిల్చినందుకు ఈ సంబరాలు చేసుకుంటున్నారా..? 30 లక్షలమందిని మోసం చేసినందుకు ఈ సంబరాలు జరుగుతున్నాయా..? అని ప్రశ్నించారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఇప్పుడు ఫండ్స్ డైవర్షన్ తో కాలం గడుపుతోందన్నారు. రైతు భరోసా నిధులు మళ్లించి రైతు రుణమాఫీ చేస్తున్నారని పరోక్షంగా గుర్తు చేశారు కేటీఆర్.

రైతు భరోసా సంగతేంటి..?

రెండు సీజన్లు పూర్తయినా కూడా ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదని, జూన్ లో వేయాల్సిన రైతు భరోసా, జులై వచ్చినా రైతుల ఖాతాల్లో జమ కాలేదని చెప్పారు కేటీఆర్. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేల హామీ కూడా ఇంకా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పాలన మభ్యపెట్టడానికి మారుపేరులా ఉందన్నారు కేటీఆర్.

First Published:  19 July 2024 6:52 AM GMT
Next Story