Telugu Global
Telangana

ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష.. ఇదిగో ఉదాహరణ - కేటీఆర్ ట్వీట్‌

ఇటీవల ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. ప్రధాని మోడీతో సమావేశమై రాజధాని నిర్మాణంతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయం కోరినట్లు వార్తలు వచ్చాయి.

ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష.. ఇదిగో ఉదాహరణ - కేటీఆర్ ట్వీట్‌
X

స్వీయ రాజకీయ అస్తిత్వమే.. తెలంగాణకు శ్రీరామరక్ష అంటూ మరోసారి స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయడం ద్వారా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేసి సాధించగలమన్నారు కేటీఆర్.

ఇందుకు ఉదాహరణగా NDA కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి 12 బిలియన్ డాలర్ల (రూ.లక్ష కోట్ల) ఆర్థిక సాయాన్ని కోరుతుందంటూ బ్లూమ్‌బర్గ్‌ రాసుకొచ్చిన ఓ వార్తను ట్యాగ్ చేశారు కేటీఆర్. ఈ పరిణామాలను తెలంగాణ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని భావిస్తున్నానన్నారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. ప్రధాని మోడీతో సమావేశమై రాజధాని నిర్మాణంతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయం కోరినట్లు వార్తలు వచ్చాయి.


కేంద్రంలో ఈసారి బీజేపీకి తగినంత మెజార్టీ రాకపోవడంతో తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వాన్ని శాసించి సాధించుకోగలిగే స్థానంలో నిలిచాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించలేదు. 240 స్థానాలకు పరిమితమైంది. దీంతో 16 స్థానాలున్న టీడీపీ, 12 స్థానాలున్న జేడీయూ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నితీశ్‌ కుమార్‌ సైతం బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ లేదా స్పెషల్ స్టేటస్‌ ఇవ్వాలని కోరుతున్న విషయం తెలిసిందే.

First Published:  11 July 2024 5:12 AM GMT
Next Story