Telugu Global
Telangana

కేటీఆర్ బహిరంగ లేఖ.. ప్రభుత్వం సమాధానమిస్తుందా..?

దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డపై ఇలాంటి నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను అమలు చేయడం కుదరదని అన్నారు కేటీఆర్.

కేటీఆర్ బహిరంగ లేఖ.. ప్రభుత్వం సమాధానమిస్తుందా..?
X

తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు. నూతన చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరపున ఒక తీర్మానాన్ని సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలని కూడా ఆ లేఖలో డిమాండ్ చేశారు కేటీఆర్.


దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై అనేక రాష్ట్రాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు కేటీఆర్. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయన్నారు. నూతన చట్టాల్లో ఉన్న పలు సెక్షన్లు పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి స్పష్టం చేయాలని కోరారు కేటీఆర్.

దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డపై ఇలాంటి నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను అమలు చేయడం కుదరదని అన్నారు కేటీఆర్. ఇతర రాష్ట్రాలను చూసయినా ఆ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. ఆ చట్టాలకు సవరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఆ చట్టాలను యథాతథంగా అమలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని అసెంబ్లీలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆ చట్టాలను అలాగే అమలు చేస్తే.. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని హెచ్చరించారు.

First Published:  22 July 2024 10:27 AM GMT
Next Story