Telugu Global
Telangana

కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌

24 గంటల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌
X

తన గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు ఆరోపణలు చేశారని, 24 గంటల్లోగా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. తన అడ్వొకేట్‌ ద్వారా ఈ నోటీసులు పంపించారు. తాను మంత్రిగా పని చేసిన కాలంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశానని, నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్‌ కారణమని సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలన్నీ తప్పు అని, రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును, సినీ నటుల పేర్లు వాడుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తో తనకు సంబంధమే లేదని, మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. మంత్రి హోదాను ఆమె దుర్వినియోగం చేశారని, దురుద్దేశ పూరితంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం అయ్యాయన్నారు. గతంలోనూ సురేఖ ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారని, ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయవద్దని భారత ఎన్నికల సంఘం మంత్రికి గట్టి హెచ్చరికలు చేసిందని గుర్తు చేశారు. అయినా సురేఖ మాటల్లో మార్పు రాలేదన్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు కూడా వేస్తామని హెచ్చరించారు.





First Published:  2 Oct 2024 3:55 PM GMT
Next Story