Telugu Global
Telangana

సీతారామ ట్రయల్‌ రన్ సక్సెస్‌...కేటీఆర్ ట్వీట్‌

నీటి పారుదల రంగంలో కేసీఆర్ టీమ్ చేసిన అద్భుత కృషికి సీతారామ ప్రాజెక్టు మరో ఉదాహరణ అని చెప్పుకొచ్చారు కేటీఆర్.

సీతారామ ట్రయల్‌ రన్ సక్సెస్‌...కేటీఆర్ ట్వీట్‌
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్‌ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్‌ రన్‌ను పర్యవేక్షించారు. ట్రయల్‌ రన్ విజయం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. పంప్‌హౌస్‌ వద్ద గోదావరి నీళ్లకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది.

సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న ఆనాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్‌ బ్యారేజ్‌ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ. 17 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు పనులు తుది దశకు చేరుకున్నాయి.

తాజాగా ట్రయల్ రన్ సక్సెస్‌ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నీటి పారుదల రంగంలో కేసీఆర్ టీమ్ చేసిన అద్భుత కృషికి సీతారామ ప్రాజెక్టు మరో ఉదాహరణ అని చెప్పుకొచ్చారు కేటీఆర్. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరందుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయడంలో భాగస్వాములైన ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లు, ఏజెన్సీలు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.



First Published:  27 Jun 2024 9:58 AM GMT
Next Story