Telugu Global
Telangana

దేశంలోనే మొదటి సారి...ఈ రోజు తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించనున్న కేటీఆర్

కూల్ రూఫ్ విధానంలో నిర్మించే ఇంటి పైకప్పు వల్ల ఇంట్లో దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. పైకప్పులకు ఉపయోగించే సామాగ్రితో పాటు కొన్ని రసాయనాలను కలుపుతారు. దీనివల్ల రూఫ్ కు తగిలిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది తిరిగి వాతావరణంలో కలుస్తాయి.

దేశంలోనే మొదటి సారి...ఈ రోజు తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించనున్న కేటీఆర్
X

రోజు రోజుకు వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలతో ప్రజలు రోడ్లమీదికి వెళ్ళడం పక్కనపెడితే ఇంట్లో ఉండటం కూడా కష్టమైపోతోంది. దీనికి విరుగుడుగా దేశంలోనే మొదటి సారి తెలంగాణ ప్రభుత్వం కూల్ రూఫ్ విధానాన్ని తీసుకరానుంది.

కూల్ రూఫ్ విధానంలో నిర్మించే ఇంటి పైకప్పు వల్ల ఇంట్లో దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. పైకప్పులకు ఉపయోగించే సామాగ్రితో పాటు కొన్ని రసాయనాలను కలుపుతారు. దీనివల్ల రూఫ్ కు తగిలిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది తిరిగి వాతావరణంలో కలుస్తాయి. దీనివల్ల విద్యుత్తు ఆదా కూడా అవుతుంది. ఈ పద్దతిని తెలంగాణ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్, త్రిబుల్ ఐటీ, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కమిటీ, జీహెచ్ ఎంసీ లు సంయుక్తంగా ఈ కూల్ రూఫ్ విధానాన్ని తీసుకవచ్చాయి. 2023 నుండి 2028 వరకు ఐదేళ్ళు అమలులో ఉండే ఈ పథకాన్ని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించనున్నారు.

కొత్తగా నిర్మించే ప్రభుత్వ, వాణిజ్య భవనాలకు ఈ విధానం తప్పనిసరి కానుంది. వాణిజ్యభవనాలకు అనుమతుల్లో భాగంగా ఈ విధానాన్ని పొందుపర్చనున్నారు. అంతే కాకుండా బలహీనవర్గాల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్ళకు కూడా కూల్ రూఫ్ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు.

First Published:  3 April 2023 2:49 AM GMT
Next Story