Telugu Global
Telangana

నీటి సంక్షోభం దిశగా భారత్ ...తెలంగాణకు ప్రమాదం లేదంటున్న ప్రభుత్వం

నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉందని, దాదాపు 70 శాతం నీరు కలుషితమైందని నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా16 శాతం. అయితే ప్రపంచంలోని మంచినీటి వనరులలో మనదేశంలో ఉన్నది కేవలం నాలుగు శాతం మాత్రమే.

నీటి సంక్షోభం దిశగా భారత్ ...తెలంగాణకు ప్రమాదం లేదంటున్న ప్రభుత్వం
X

భారతదేశం తీవ్రమైన‌ నీటి సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్ ‘కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్’ ప్రకారం, భారతదేశం దాని చరిత్రలోనే అత్యంత దారుణమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 600 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని పేర్కొంది. 2030లో నీటి డిమాండ్ 1498 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, సరఫరా 744 బిసిఎం మాత్రమే ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉందని, దాదాపు 70 శాతం నీరు కలుషితమైందని నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా16 శాతం. అయితే ప్రపంచంలోని మంచినీటి వనరులలో మనదేశంలో ఉన్నది కేవలం నాలుగు శాతం మాత్రమే.

నీతి ఆయోగ్ నివేదిక, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైతో సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు ఏ క్షణంలోనైనా ఖాళీ కావచ్చని పేర్కొంది. తలసరి ప్రాతిపదికన, నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్ల నుండి 2011లో 1,546కి, 2021లో 1,367కి తగ్గింది. 2030 నాటికి దేశంలో నీటి సరఫరా కన్నా రెండింతలు డిమాండ్ ఉంటుందని అంచనా.

ప్రపంచంలోనే అత్యధిక భూగర్భ జలాలను వాడుతున్న దేశం మనదే. చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ నీటిని వాడుతున్నాం. అయితే, భారతదేశంలో వెలికితీసిన భూగర్భజలాలలో ఎనిమిది శాతం మాత్రమే తాగడానికి ఉపయోగిస్తున్నాం. 80 శాతం వ్యవసాయానికి,మిగిలిన 12 శాతం పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నాం. దేశంలోని 700 జిల్లాల్లో 256 జిల్లాలు భూగర్భజల మట్టాలను అతిగా వినియోగించుకుంటున్నాయని కేంద్ర భూగర్భ జల సంఘం ఇటీవలి అధ్యయనంలో నివేదించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కథ పూర్తిగా వేరుగా ఉందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అధికారుల ప్రకారం...

నీటి లభ్యత, నిర్వహణ ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భూగర్భ జలాలను మెరుగుపరుస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అమలు రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు లభ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.

గత ఏడేళ్లలో, రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్యక్రమాల వల్ల సగటు భూగర్భ జలాలు 4.26 మీటర్లకు పైగా పెరిగాయి. 2014లో ప్రారంభించిన మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,000 చెరువుల‌ను పునరుద్ధరించారు. 20 లక్షల ఎకరాల భూమిని కొత్తగా సాగులోకి తెచ్చారు. దీని వల్ల‌ నీటి వనరుల నిల్వ సామర్థ్యం పెరిగింది.

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నది. ఈ విషయంలో, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించింది.

మిషన్ భగీరథను కేంద్రం, నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు కూడా ప్రశంసించాయి.

మూడు బ్యారేజీలతో 1531 కి.మీ గ్రావిటీ కెనాల్స్, 203 కి.మీ టన్నెల్స్, 20 లిఫ్టులు, 19 పంప్ హౌస్‌లు, మొత్తం 147 టిఎంసిల సామర్థ్యంతో 20 రిజర్వాయర్ల ద్వారా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

సాగునీటి ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు, సరస్సుల పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 250 కోట్ల మొక్కలను నాటింది, ఇది రాష్ట్రంలో భూగర్భ జలాలను మెరుగుపరచడంలో దోహదపడింది.

తెలంగాణ, హర్యానా, గోవా, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు 100 శాతం ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్‌లను సాధించాయని జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవలి నివేదిక వెల్లడించింది. గోదావరి, కృష్ణా నదుల నుంచి జలాలను తీసుకుని వచ్చి, 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్న నీటి సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

First Published:  27 March 2023 3:49 AM GMT
Next Story