కుటుంబ సర్వేపై సామాజికవేత్తలతో స్వతంత్ర కమిటీ
చైర్మన్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్ కంచ ఐలయ్య

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, కుల, న్యాయ (కుటుంబ) సర్వేను అధ్యయనం చేయడానికి సామాజికవేత్తలతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సెక్రటేరియట్ లో స్వతంత్ర కమిటీ బాధ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కమిటీకి చైర్మన్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కన్వీనర్ గా ప్రవీణ్ చక్రవర్తి వ్యవహరిస్తారని తెలిపారు. సభ్యులుగా డాక్టర్ సుఖదేవు, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, శాంత సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, ప్రొఫెసర్ భూక్య భంగ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ డ్రీజ్ ఉంటారని తెలిపారు. ప్రభుత్వం చేసిన కుటుంబ సర్వేనే ఈ కమిటీ అధ్యయనం చేసి నెల రోజుల్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు తమ నివేదిక అందజేస్తుందన్నారు. సమావేశంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.