Telugu Global
Telangana

రాత్రి 11 దాటితే అంతే.. హైదరాబాద్‌లో కొత్త ఆంక్షలు!

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నేరాలను కట్టడి చేయడానికి సామాన్య పౌరుల స్వేచ్ఛను హరించకూడదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాత్రి 11 దాటితే అంతే.. హైదరాబాద్‌లో కొత్త ఆంక్షలు!
X

హైదరాబాద్‌లో నైట్‌ లైఫ్‌కు ఓ క్రేజ్‌ ఉంటుంది. చాలా మంది హైదరాబాద్‌లో నైట్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే నైట్‌ లైఫ్ అభిమానులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని రకాల వ్యాపార సంస్థలు రాత్రి 11 గంటలలోపు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11 తర్వాత రోడ్లపై తిరగకుండా ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.

ఇటీవల సిటీలో నేరాలు పెరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి పూట బైక్‌ రైడ్స్‌ను సైతం అడ్డుకోవాలని పోలీసులకు సూచించారు. మ‌రోవైపు పోలీసులకు సంబంధించి ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 11 తర్వాత షాపులు ఓపెన్ చేసి ఉంచితే లాఠీ ఛార్జి చేస్తామంటూ ఈ వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఫ్రెండ్లీ పోలీసు ఉండదని.. కేవలం లాఠీ ఛార్జి పోలీసు మాత్రమేనంటూ వీడియోలో ఉంది.


ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నేరాలను కట్టడి చేయడానికి సామాన్య పౌరుల స్వేచ్ఛను హరించకూడదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కర్ఫ్యూ పరిస్థితులు తలపిస్తున్నాయని మరికొందరు మండిపడుతున్నారు. చార్మినార్ లాంటి ప్రాంతాల్లో రాత్రిపూటనే ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారని.. పోలీసుల ఆంక్షలు సరికాదంటున్నారు. అర్ధరాత్రి వరకు షాపుల ఓపెన్‌ చేసి ఉంచేందుకు అనుమతించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ ఏరియాలో వ్యాపారసంస్థలు అర్ధరాత్రి వరకు, హోటల్స్ ఒంటి గంట వరకు ఓపెన్ చేసి ఉంచేలా అనుమతించింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ తాజా నిర్ణయంపై వ్యాపారులు, స్థానికులు మండిపడుతున్నారు.

First Published:  24 Jun 2024 4:08 PM GMT
Next Story