ఖమ్మం మార్కెట్ యార్డ్ చరిత్రలో తొలిసారి ఇలా..మిరపకు రికార్డు ధర!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. గురువారంనాడు ఆ మార్కెట్ లో ఏసీ రకం మిరపకాయకు అత్యధిక ధర లభించడంతో మార్కెట్ చరిత్రలోనే రికార్డుగా నిలిచింది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. గురువారంనాడు ఆ మార్కెట్ లో ఏసీ రకం మిరపకాయకు అత్యధిక ధర లభించడంతో మార్కెట్ చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. ఈ మార్కెట్ లో తొలిసారి క్విటాల్ మిరపకాయకు రూ.22,800 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ ఏసీ రకం మిర్చి పంటను పండించారు. ఇరవై రెండు బస్తాల పంటను ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు తరలించాడు. క్వింటాలు ఒక్కింటికి రూ.22,800 ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు.
మార్కెట్కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరుకు వచ్చినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా, తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా తెచ్చి విక్రయిస్తున్నారు. కాగా, ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలికింది. కాగా, మార్కెట్లు నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20వేలు పలకడం విశేషం.