Telugu Global
Telangana

భద్రాచలం జలదిగ్బంధం.. గోదావరి కారణం కాదు

10రోజుల క్రితం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు భద్రాచలం వద్ద 53 అడుగుల వరకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా కూడా భద్రాచలంలోకి నీరు రాలేదు. కానీ ఇప్పుడు గోదావరి శాంతంగానే ఉంది, భద్రాచలంలోకి మాత్రం నీరు చేరింది.

భద్రాచలం జలదిగ్బంధం.. గోదావరి కారణం కాదు
X

భద్రాచలంలోకి వరదనీరు చేరిందంటే కారణం గోదావరి మాత్రమే అనుకుంటాం. కానీ ఈసారి గోదావరి వరదనీరు లేకుండానే భద్రాచలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలంలోని రాములవారి ఆలయం చుట్టూ వరదనీరు చేసింది. అన్నదాన సత్రంలోకి కూడా నీరు చేరింది. ఆలయం చుట్టూ ఉన్న షాపులు నీట మునిగాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వరదనీటిని మోటర్లతో తోడి గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు.

10రోజుల క్రితం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు భద్రాచలం వద్ద 53 అడుగుల వరకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా కూడా భద్రాచలంలోకి నీరు రాలేదు. కానీ ఇప్పుడు గోదావరి శాంతంగానే ఉంది, భద్రాచలంలోకి మాత్రం నీరు చేరింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలే దీనికి కారణం. ఈ వర్షపు నీరు డ్రెయిన్ల ద్వారా గోదావరిలోకి చేరాల్సి ఉంది. రాముల వారి ఆలయం వద్ద స్లూయిజ్ గేట్లు ఉంటాయి. ఇక్కడ నీటిని మోటార్ల ద్వారా గోదావరిలోకి ఎత్తిపోస్తారు. ఆ వ్యవస్థ స్తంభించడం 24గంటలసేపు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. దీంతో ఆ నీరంతా ఆలయ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టింది.

ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్ ఈ డ్రెయిన్ నీటిలోనే పడి చనిపోయిన ఘటన అందర్నీ కలచి వేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానికులు చాన్నాళ్లుగా వేడుకుంటున్నా అధికారుల అలసత్వంతో అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. గోదావరిలో వరద లేకపోయినా.. ఆలయ పరిసరాలు నీట మునగడం విశేషం.

First Published:  8 Aug 2024 3:53 AM GMT
Next Story