Telugu Global
Telangana

ఇది ముమ్మాటికీ మోసమే: కేటీఆర్‌

కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిందని మండిపడిన కేటీఆర్‌

ఇది ముమ్మాటికీ మోసమే: కేటీఆర్‌
X

ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటున్నది కాంగ్రెస్ పాలనా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. ఇప్పుడు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా, రుణమాఫీ పై బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయి. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిందని కేటీఆర్‌ మండిపడ్డారు.

మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ? కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? అని ప్రశ్నించారు. 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారని విమర్శించారు. చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..? అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..? అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన అని విమర్శించారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ…నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు. గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు.ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్‌ హెచ్చరిస్తూ పోస్ట్‌ పెట్టారు.

First Published:  20 Sep 2024 5:04 PM GMT
Next Story