ఆ దేశంతో శాంతి కోసం ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వం, మోసమే
ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందన్న మోడీ

పాకిస్థాన్తో శాంతి కోసం ప్రయత్నాలు చేసినప్పుడల్లా శతృత్వం, నమ్మక ద్రోహమే ఎదురయ్యాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రీడ్మ్యాన్ తో పాడ్కాస్ట్లో అనేక అంశాలపై మాట్లాడిన ప్రధాని.. పాక్, చైనాలతో భారత్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, పాక్లు కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్షరీఫ్ను ఆహ్వానించాను. శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వం, మోసమే ఎదురైంది. ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉన్నది. శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను. అని ప్రధాని పేర్కొన్నారు. పాక్ ప్రజలు శాంతి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, కలహాలు, అశాంతితో వారు అలసిపోయారన్నారు. ఉగ్రదాడుల్లో దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా దౌత్యపర సంకేతాల ఇచ్చామని ప్రధాని చెప్పారు. విదేశాంగ విధానంపై గతంలో తన విధానాన్ని ప్రశ్నించిన వారు... సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడాన్ని చూసి ఆశ్చర్యపోయారని గుర్తుచేశారు. భారత విదేశాంగ విధానం ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనమన్నారు. శాంతి, సామరస్యానికి భారత్ నిబద్ధతతో ఉన్నదని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని, అయినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని అన్నారు.