Telugu Global
Telangana

సెప్టెంబర్ 2న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అప్పగింత..

పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారని అన్నారు మంత్రి తలసాని. పేదలంతా ఆత్మగౌరవంతో గొప్పగా బ్రతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూమ్ కాలనీల పరిధిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

సెప్టెంబర్ 2న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అప్పగింత..
X

హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్-2 న లబ్ధిదారులకు తాళాలు అప్పగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఆన్ లైన్ డ్రా పూర్తి కావడంతో లబ్ధిదారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ వర్చువల్ గా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపిక ఎలా అంటే..?

మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేశారు. సెప్టెంబరు 2న లబ్ధిదారులకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కాలనీల వద్ద వాటి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇళ్లు కేటాయించారనేది అధికారులు ముందుగానే తెలియజేస్తారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు మంత్రి తలసాని.


అన్ని సౌకర్యాలు..

పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారని అన్నారు మంత్రి తలసాని. పేదలంతా ఆత్మగౌరవంతో గొప్పగా బ్రతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూమ్ కాలనీల పరిధిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు సౌకర్యాలను కల్పించామన్నారు. టెలికాన్ఫరెన్స్ లో బహదూర్‌ పుర, ఆసిఫ్‌ నగర్‌, సైదాబాద్‌, యూసఫ్‌ గూడ, బేగంబజార్‌, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు మంత్రితో మాట్లాడారు. తమ ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.


First Published:  29 Aug 2023 2:40 PM GMT
Next Story