రేపటితో ముగియనున్న `గృహలక్ష్మి` దరఖాస్తుల గడువు
ఆగస్టు 10లోపు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలన చేస్తామని, అర్హులను ఎంపిక చేసి ఇదే నెల 25న జాబితా ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు.

గృహలక్ష్మి పథకం. నిరుపేదలు ఇల్లు కట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు సహాయం చేసే పథకం ఇది. ఈ స్కీమ్ పరిధిలో లబ్ధిదారులుగా ఉన్నవాళ్లు అలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది. ఈ నెల 10 లోగా అంటే రేపటిలోగా దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు ఈ పథకం నుంచి ఈనెలలోనే లబ్ధి అందనుంది.
రేపు దాటిన తర్వాత కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. కానీ.. వాటిని రెండో విడతలో మాత్రమే పరిశీలిస్తారు. ఆగస్టు 25న ప్రభుత్వం ప్రకటించనున్న తొలి జాబితాలో మాత్రం ఎల్లుండి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆగస్టు 10లోపు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలన చేస్తామని, అర్హులను ఎంపిక చేసి ఇదే నెల 25న జాబితా ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆమోదంతో ఈ జాబితా రూపొందిస్తామని తెలియజేశారు.
ఇది 100 శాతం రాయితీతో ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి అర్హత ఉన్నవారు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడంలో త్వరపడడం మంచిది.