Telugu Global
Telangana

వడ్ల స్కాం బయట పడింది.. అందుకే ఫోన్ ట్యాపింగ్ లీకు

ఆరు గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేస్తే ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని తమపై ఎదురుదాడికి దిగారని గుర్తు చేశారు సంజయ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ లో నిజానిజాలు మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

వడ్ల స్కాం బయట పడింది.. అందుకే ఫోన్ ట్యాపింగ్ లీకు
X

తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థత, కుంభకోణాలు.. బయటపడిన వెంటనే ప్రత్యర్థి వర్గాన్ని టార్గెట్ చేసేందుకు వారు లీకులిస్తుంటారని మండిపడ్డారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్. తాజాగా వడ్ల స్కామ్ బయటపడింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ లీక్ ఇచ్చారన్నారు. ఆరునెలల నుండి లీకులు, స్కామ్ ల మీదనే ప్రభుత్వం నడుస్తోందన్నారాయన. మంత్రి జూపల్లి‌ కృష్ణారావు లిక్కర్ స్కామ్ బయట పడిందని, వడ్ల స్కామ్ కూడా మంత్రుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పారు. లీకేజ్ లతో తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని అన్నారు సంజయ్ కుమార్.

గతంలో ఆరు గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేస్తే ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని తమపై ఎదురుదాడికి దిగారని గుర్తు చేశారు సంజయ్ కుమార్. అసలు ఫోన్ ట్యాపింగ్ లో నిజానిజాలు మొత్తం బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో వాస్తవాలు తేల్చి కేసులు పెట్టి నిందితుల్ని జైలుకు పంపాలన్నారు. పసలేని వాదనలతో, కవరింగ్ గేమ్ తో కాంగ్రెస్ ‌కాస్తా స్కాంగ్రెస్ గా‌ మారిందని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ గుడుంబాని‌ తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు సంజయ్ కుమార్.

కాళేశ్వరం మరమ్మతులకు పనికిరాదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు రిపేర్లు చేయిస్తోందని అన్నారు సంజయ్ కుమార్. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరేటర్ లు, ట్యాంకర్ లలో నీరు కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ కి మూడో స్థానం వచ్చిందని, అపజయాన్ని కవర్ చేసుకోడానికి తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన వరిపంటకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం లేదన్నారు సంజయ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తిరగకుండానే ఫెయిల్యూర్ అనే ముద్ర వేయించుకుందని చెప్పారు.

First Published:  28 May 2024 10:04 AM GMT
Next Story