Telugu Global
Telangana

మేయర్‌, కార్పొరేటర్ల కిడ్నాప్‌కు యత్నం.. ORRపై 20 కార్లతో ఛేజింగ్

ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్‌ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు.

మేయర్‌, కార్పొరేటర్ల కిడ్నాప్‌కు యత్నం.. ORRపై 20 కార్లతో ఛేజింగ్
X

11 మంది కార్పొరేటర్లు.. వారిని కిడ్నాప్ చేసేందుకు 20 కార్లతో ఛేజింగ్. ఇదంతా జరిగింది హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై. పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డితో పాటు 11 మంది కార్పొరేటర్లను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ దృశ్యాలు సినిమాను తలపించాయి.


ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్‌ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయాన్ని డీజీపీ, రాచకొండ కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనా అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఔటర్‌ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వెంబడించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్‌ రావు. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


ఈ ఘటన నుంచి తప్పించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు మేయ‌ర్ జక్కా వెంకట్‌ రెడ్డి. కిడ్నాప్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. కాంగ్రెస్‌ నాయకులతో పాటు 50 మందికిపైగా సుపారీ గూండాలు దాదాపు గంటన్నర పాటు తమ కార్లను వెంబడించారని చెప్పారు. అవిశ్వాసం నెగ్గేందుకు కార్పొరేటర్లు కావాలి కానీ.. ఇలా హత్య రాజకీయాలు చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు జక్కా.

First Published:  20 May 2024 3:06 AM GMT
Next Story