Telugu Global
Telangana

ఆ విషయంలో మ‌హేంద‌ర్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు..

తాండూరు సరిహద్దు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం అని.. ఇక్కడ ఏది కావాలన్నా తాను చేస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. జినుగుర్తిలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్కు కావాల‌న్నారని వెంటనే ఆ పని చేసి పెడతానన్నారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు మిగ‌తావి కూడా ఇచ్చేస్తానన్నారు.

ఆ విషయంలో మ‌హేంద‌ర్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు..
X

తెలంగాణలో కొన్నిచోట్ల బీఆర్ఎస్ సిట్టింగ్ లను మార్చాల్సి వచ్చింది, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు అదే స్థానం నుంచి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ దశలో కొంతమంది సిట్టింగ్ లు, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసినవారు అసంతృప్తికి లోనయ్యారు. అయితే మరికొందరు మాత్రం కేసీఆర్ నిర్ణయానికి జై కొట్టారు. అలాంటి నియోజకవర్గాల్లో తాండూరు ఒకటి. 2014లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడ గెలిచారు, అయితే ఆ వెంటనే బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఈసారి అక్కడ మహేందర్ రెడ్డికి కాకుండా రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ విషయంలో పట్నం పెద్ద మనసు చేసుకున్నారని అందుకు ఆయనకు ధన్యవాదాలు అని చెప్పారు సీఎం కేసీఆర్. పట్నం ఆశీస్సులు కూడా మనకే ఉన్నాయమని చెప్పారు. తాండూరులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇప్పించాలని కోరారు.


రోహిత్ నిజాయితీ కోసం నిలబడ్డాడు..

ఆ మధ్య బీజేపీ నేతలు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేయాలనుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఫామ్ హౌస్ లో జరిగిన వ్యవహారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా బయటపెట్టారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఆ సమయంలో రోహిత్ రెడ్డి నిజాయితీ కోసం నిలబడ్డారని, బీజేపీ వాళ్లు మ‌న ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టాల‌ని కుట్ర చేస్తే వాళ్ల‌ను ప‌ట్టించి జైల్లో వేయించారని అభినందించారు సీఎం కేసీఆర్. తాండూరు సభలో రోహిత్ రెడ్డిని ప్రశంసించారు కేసీఆర్.

తాండూరు సరిహద్దు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం అని.. ఇక్కడ ఏది కావాలన్నా తాను చేస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. జినుగుర్తిలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్కు కావాల‌న్నారని వెంటనే ఆ పని చేసి పెడతానన్నారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు మిగ‌తావి కూడా ఇచ్చేస్తానన్నారు. బంజారా బిడ్డ‌లు తండాలో తమ రాజ్యం కావాల‌ని కొట్లాడారని, బీఆర్ఎస్ హయాంలోనే వారి కల సాకారం అయిందన్నారు కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 3,500 తండాల‌ను గ్రామ‌ పంచాయ‌తీలుగా చేశామన్నారు. తాండూరులో 24 తండాలు గ్రామ పంచాయ‌తీలు అయ్యాయని వివరించారు. తాండూరు సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేలిపోయిందన్నారు కేసీఆర్.


First Published:  22 Nov 2023 9:48 AM GMT
Next Story