ప్రజా సంక్షేమం కోరుకునే శక్తులు ఏకం కావాలి : సీఎం కేసీఆర్
యూపీ, తమిళనాడు, ఎంపీ, కర్నాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా.. 25 రాష్ట్రాలకు చెందిన వంద మంది రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు తెలంగాణకు వచ్చారు. శనివారం ప్రగతి భవన్లో వీరందరినీ సీఎం కేసీఆర్ కలిశారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రైతు సమస్యలకు ఎందుకు పరిష్కారం దొరకడం లేదో.. దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడు దశాబ్దాలు గడిచినా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు యూపీ, తమిళనాడు, ఎంపీ, కర్నాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా.. 25 రాష్ట్రాలకు చెందిన వంద మంది రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు తెలంగాణకు వచ్చారు. శనివారం ప్రగతి భవన్లో వీరందరినీ సీఎం కేసీఆర్ కలిశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన రైతు సదస్సులో ముందుగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రతినిధులతో కలసి కేసీఆర్ వీక్షించారు.







అనంతరం రైతు సంఘాల నాయకులతో సీఎం మాట్లాడుతూ.. రైతు సమస్యల గురించి దేశ పాలకులు ఆలోచించాలని ఆకాంక్షించారు. ఇప్పటికీ ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికీ దేశంలోని అనేక వర్గాలు తమ హక్కుల కోసం, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రతీ ఒక్కరు ఆలోచించాలని ఆయన కోరారు. దేశంలో ప్రజా సంక్షేమం కోరుకునే శక్తులన్నీ ఏకం కావల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. చట్ట సభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సింది పోయి.. పని చేసే వారిపైనే ఆంక్షలు పెడుతున్నారని.. దేశ పాలకులే ఇబ్బందులకు గురి చేస్తోందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండటం చాలా దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందని అన్నారు. ఇక ఈ సదస్సు సందర్భంగా చూపించిన డాక్యుమెంటరీపై రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. శుక్రవారం తాము క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పరిస్థితులనే డాక్యుమెంటరీలో చూపించారని అన్నారు. ఇక్కడ వ్యవసాయం, నీటి పారుదల రంగం చాలా బాగుందని కొనియాడారు. తమ రాష్ట్రాల్లో కూడా రైతు సంక్షేమ పథకాలు ఉంటే తాము కూడా ఎంతో అభివృద్ధి చెందే వారమని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని రైతుల గురించి కూడా ఆలోచన చేయాలని వారు ఆకాంక్షించారు.