Telugu Global
Telangana

వేర్వేరు గురుకులాలతో పిల్లల మనసుల్లో విషం నిండుతుంది

అందుకే ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రారంభిస్తున్నాం : సీఎం రేవంత్‌ రెడ్డి

వేర్వేరు గురుకులాలతో పిల్లల మనసుల్లో విషం నిండుతుంది
X

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరుగా గురుకులాలు ఉంటే వారి మనసుల్లో విషం నిడుతుతుందని, అందుకే కులమతాలకు అతీతంగా అందరు కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గులో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాలు, మతాల మధ్య వైషమ్యాలు తొలగించడం తమ విధానం అయితే, వాళ్ల కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలు అనేది కేసీఆర్‌ విధానం అన్నారు. వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలితే.. పేద పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా అని ప్రశ్నించారు. బీసీలకు అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్‌ పార్టీ అని, కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ప్రజలు గుండు సున్నా ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదన్నారు. ''వాళ్లకు జ్ఞానోదయం కాకపోయినా ఫరవాలేదు.. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదు.. రాష్ట్రంలోని 1,023 రెసిడెన్షియల్ స్కూల్స్ లో కేసీఆర్ పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించలేదు.. 33జిల్లాల్లో ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ భవనాలు కట్టుకుండు.. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి, పైసలు ఉన్నయ్ కానీ.. పిల్లలకు బడికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది.. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు.. కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు? ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో... ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే విమర్శిస్తున్నారు.. కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా?'' అని ప్రశ్నించారు.

తెలంగాణ విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని తాము భావిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్య, నిరుపేదలకు వైద్యం అందిస్తామని మాట ఇచ్చామని వాటిని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసిందని, రాష్ట్రంలో 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందన్నారు. తమ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకుందని, అందుకే విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్నారు. కేసీఆర్‌ హయాంలో రూ. 22లక్షల కోట్ల బబ్జెట్‌ ఖర్చు చేస్తే అందులో రూ.7 లక్షల కోట్లు అప్పులేనని తెలిపారు. రూ.22 లక్షల కోట్లల్లో పేద పిల్లలు చదివే స్కూళ్లలో వసతుల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయలేదన్నారు. 1972 పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. పీవీ దార్శనిక ఆలోచనతో బుర్రా వెంకటేశం లాంటివారు ఆ స్కూళ్లలో చదివి ఐఏఎస్ స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తుంటే తప్పు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, నిన్ననే 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందజేశామన్నారు.

First Published:  11 Oct 2024 11:42 AM GMT
Next Story