Telugu Global
Telangana

కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు

ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి తన వద్ద నుంచి డబ్బు వసూలు చేసి కేఏ పాల్ తనను మోసగించారని కిరణ్ కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు
X

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ మోసం చేశారని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ప్రజాశాంతి పార్టీ తరఫున ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ తెలిపారు.

ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని, రూ. 30 లక్షలు ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లింపు జరిపానని, మిగిలిన 20 లక్షల రూపాయలు పలు దఫాలుగా కేఏ పాల్‌కు నేరుగా అందజేసినట్లు కిరణ్ తెలిపారు. తన వద్ద నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి తన వద్ద నుంచి డబ్బు వసూలు చేసి కేఏ పాల్ తనను మోసగించారని కిరణ్ కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేఏ పాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు.

First Published:  17 May 2024 2:47 PM GMT
Next Story