Telugu Global
Telangana

ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు.. రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌

నిక్కర్ తొడిగి బూటు కాళ్లతో తన్నడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు ముందే చిత్రహింసలు పెట్టారని, రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు.

ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు.. రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌
X

షాద్‌నగర్‌లో దళిత మహిళ పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇదేనా ఇందిరమ్మ పాలన.. ఇదేనా ప్రజాపాలన అంటూ నిలదీశారు.

కేటీఆర్ ట్వీట్ ఇదే..

దళిత మహిళపై ఇంత దాష్టీకమా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. నిక్కర్ తొడిగి బూటు కాళ్లతో తన్నడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు ముందే చిత్రహింసలు పెట్టారని, రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు కేటీఆర్. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు, మరోవైపు దాడులు, దాష్టీకాలు.. యథా రాజా తథా ప్రజా అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు కూడా మేమేమి తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆడబిడ్డల ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.

షాద్‌నగర్‌ ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు కేటీఆర్. దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళకు వెంటనే న్యాయం చేయాలన్నారు కేటీఆర్. దళిత వ్యతిరేక, మహిళ వ్యతిరేక కాంగ్రెస్‌ సర్కార్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.

First Published:  5 Aug 2024 7:37 AM GMT
Next Story