Telugu Global
Telangana

అంబేద్క‌ర్ జ‌యంతి రోజున స్వామి వివేకానందకు నివాళుల‌ర్పించిన బీజేపీ నేత‌.. ఇవాళ ఆ పార్టీ నేతలకేమైంది?

ఇప్పుడు మరో బీజేపీ నాయకురాలు చేసిన పనికి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈమెకు అంబేద్కర్ ఎవరో కూడా తెలియదా? అని మండిపడుతున్నారు.

అంబేద్క‌ర్ జ‌యంతి రోజున స్వామి వివేకానందకు నివాళుల‌ర్పించిన బీజేపీ నేత‌.. ఇవాళ ఆ పార్టీ నేతలకేమైంది?
X

ఇవాళ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రశంసలు పొందుతున్న వేళ.. బీజేపీ నాయకులు మాత్రం అంబేద్కర్ విషయంలో పొద్దున్నుంచి తిట్లు తింటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్ ను కీర్తిస్తూ తప్పులు తడకగా ట్విట్టర్లో సందేశం పోస్ట్ చేయడంతో ఆయనను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. నెటిజన్ల దెబ్బకు ఆయన ట్వీట్ డిలీట్ చేసి మరొకటి చేయాల్సి వచ్చింది. ఆ ట్వీట్ లో కూడా తప్పులు కనిపించాయి.

ఇప్పుడు మరో బీజేపీ నాయకురాలు చేసిన పనికి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈమెకు అంబేద్కర్ ఎవరో కూడా తెలియదా? అని మండిపడుతున్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ నాయకురాలు కసిరెడ్డి సింధూ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి బదులుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది. అంతేకాదు ఆయన విగ్రహం ఎదుట నిలబడి వందనం సమర్పిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఈ ఫొటోను తెలంగాణ రెడ్ కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక అంతే ఆ ఫొటోను చూసిన నెటిజన్లు సింధూ రెడ్డికి అంబేద్కర్ ఎవరో కూడా తెలియదా? స్వామి వివేకానందను కూడా గుర్తించలేకపోయిందా? అంబేద్కర్ విగ్రహం అనుకొని.. స్వామి వివేకానంద విగ్రహానికి నివాళి అర్పించడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస జ్ఞానం లేని ఇటువంటివారు రాజకీయ నాయకులు ఎలా అయ్యారని మండిపడ్డారు.

ఇక మరో బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి కూడా అంబేద్కర్ కు నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్ లో తప్పులు దొర్లాయి. ఈమెను కూడా నెటిజన్లు ఏకిపారిస్తున్నారు. మొత్తానికి ఇవాళ బీజేపీ నాయకుల టైం బాగోలేనట్టు ఉంది. వరుసగా తప్పులు చేసి ప్రజలతో తిట్లు తిన్నారు.

First Published:  14 April 2023 12:00 PM GMT
Next Story