Telugu Global
Telangana

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జీరో.. లాజిక్‌ చెప్పిన ఏలేటి

ఏపీకి స్పెషల్‌ స్టేటస్ ఇవ్వకుండా తెలంగాణను రక్షించిన మోడీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చేయాలన్నారు ఏలేటి.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జీరో.. లాజిక్‌ చెప్పిన ఏలేటి
X

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడంపై బీజేపీని టార్గెట్ చేశాయి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌. ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. చర్చ సందర్భంగా ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ సభ్యులు విమర్శలు గుప్పించారు.


ఐతే ఈ అంశంపై మాట్లాడిన బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వింత సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పదేపదే చెప్పడం సరికాదన్నారు ఏలేటి. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే తెలంగాణ ఏడారిగా మారుతుందన్నారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే తెలంగాణలో ఒక్క పరిశ్రమ లేకుండా ఏపీకి తరలిపోయేదన్నారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్ ఇవ్వకుండా తెలంగాణను రక్షించిన మోడీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చేయాలన్నారు ఏలేటి. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్‌ కింద రూ.3500 కోట్లు ఇస్తే కాంగ్రెస్ పెద్దలు రాత్రికి రాత్రే పంచుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏలేటి. మూసీని అడ్డం పెట్టుకుని రూ. లక్షా 50 వేల కోట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారన్నారు.

First Published:  24 July 2024 11:53 AM GMT
Next Story