Telugu Global
Telangana

షాద్‌నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

ఒకేసారి కంప్రెషర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

షాద్‌నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
X

గ్లాస్‌ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షాద్‌నగర్‌లోని సౌత్‌ గ్లాసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో ఈ ఘటన జరిగింది. ఊహించని ఈ ఘటనతో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాజు పరిశ్రమ కావడంతో పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడు జరిగిన ప్రదేశమంతా భీతావహంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెషర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. చనిపోయినవారు ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

First Published:  28 Jun 2024 5:16 PM GMT
Next Story